2,912 మంది చిన్నారులకు చుక్కలు
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలో ఆదివారం నుంచి మంగళవారం వరకు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. శనివారం పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ స్వప్న, డాక్టర్ బిక్కు నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించి సర్వం సిద్ధం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీహెచ్సీ పరిధిలో మొత్తం 2,912 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు 152 మంది వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ మధు నాయక్, పీహెచ్ఎన్ కవిత, ఫార్మసీ అధికారి కుమారచారి తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు సహకరించి విజయవంతం చేయాలని వైద్యాధికారులు కోరారు.



