– కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో
భోపాల్: రైతుల రుణమాఫీ, పంటల ధరలకు ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆదివారం నాడిక్కడ ఆ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. రెండు రాష్ట్రాల్లో క్వింటాల్ బియ్యం రూ.3,200, గోధుమలకు రూ.3,000 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
రమేష్ మాట్లాడుతూ, ”కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటిస్తే సరిపోదు. ఎందుకంటే ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకే రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయడం జరుగుతున్నది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎంఎస్పీ కచ్చితంగా అమలు చేస్తామని చెప్పింది. ఢిల్లీలో ఏడాది పాటు సాగిన రైతుల ఉద్యమంలో డిమాండ్లో ఒకటి కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని. నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదని ఆయన విమర్శించారు. మధ్యప్రదేశ్లో రూ.2 లక్షల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ఈ మ్యానిఫెస్టో హామీ ఇచ్చింది. ఐదేంద కిందటి ఎన్నికల్లో గెలిచి కమల్నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించగానే ఆ ప్రభుత్వాన్ని ఫిరాయింపు రాజకీయాలతో బిజెపి కూల్చేసిందని జైరాం రమేష్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలకు హామీ ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్ను)తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అలాగే ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంతాల్లో టెండు ఆకులను సేకరించేందుకు ఒక్కో బ్యాగ్కు 6 వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టో పేర్కొంది. . ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై కూడా శ్రద్ధ చూపుతుందని అన్నారు. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో నవంబర్లో వేర్వేరు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్గఢ్ రెండు దశల్లో నవంబర్ 7 , 17 తేదీల్లో జరగనుంది. మధ్యప్రదేశ్లో ఒకే దశలో నవంబర్ 17న పోలింగ్ జరగనుంది.