ఏపీ విభజన సరిగా జరగలేదు

Division of AP It didn't go well– రెండు రాష్ట్రాల్లో రక్తపాతానికి దారితీసింది : పార్లమెంట్‌లో మోడీ
– అవమానించడమే : రాహుల్‌ గాంధీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రధాని మోడీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణను విభజించడం రెండు రాష్ట్రాల్లో రక్తపాతానికి దారితీసిందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన సరిగా జరగలేదని, ఈ విభజన రెండు రాష్ట్రాలనూ సంతృప్తి కలిగించలేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో కష్టంతో జరిగిందని, రక్తం చిందించాల్సి వచ్చిందని, నూతన రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ వేడుకలు జరుపుకోలేకపోయిందని మోడీ పేర్కొన్నారు. ఈ పార్లమెంట్‌లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, అయితే ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ మాదిరిగా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదంటూ పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా రాష్ట్రాల విభజన జరిగిందని, ఎంతో ప్రణాళికబద్ధంగా మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని ప్రధాని మోడీ అన్నారు. ఆ మూడు రాష్ట్రాల విభజన టైంలో అవి సంబరాలు జరుపుకున్నాయని, కానీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు మాత్రం అలా సంబరాలు జరుపుకోలేకపోయాని అన్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. తెలంగాణపై ప్రధాని మోడీ చేసిన ప్రసంగం.. రాష్ట్రాన్ని అవమానపరచడం లాంటిదని ధ్వజమెత్తారు. ”తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ.. ప్రధాని మోడీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానించడమే” అంటూ మంగళవారం ట్విటర్‌ (ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌) మాధ్యమంగా రాహుల్‌ పోస్ట్‌ చేశారు. ఇందుకు ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రానికి క్షమాపణలు చెప్పాల్సిందేనని హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు.

Spread the love