నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటుడు భరత్ కాంత్ (31), యువ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ (31) దుర్మరణం పాలయ్యారు. ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్న ఇద్దరు స్నేహితులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదిభట్ల పోలీసుల కథనం ప్రకారం నెల్లూరుకు చెందిన భరత్ కాంత్, త్రిలోక్ ప్రాణ స్నేహితులు. శనివారం రాత్రి తమ సొంత ఊరి నుంచి కారులో హైదరాబాద్కు బయలుదేరారు.
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పెద్ద అంబర్పేట్ వద్ద ఓఆర్ఆర్పైకి ఎక్కి శంషాబాద్ వైపు వెళ్తుండగా, బొంగుళూరు ఎగ్జిట్ 12 వద్ద వీరి కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఓ కంటైనర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో భరత్, త్రిలోక్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భరత్ ‘టెనెంట్’ సినిమాలో హీరోగా నటించగా, త్రిలోక్ పలు చిత్రాలకు కెమెరామెన్గా పనిచేస్తూ మంచి గుర్తింపు పొందారు.



