నవతెలంగాణ – హైదరాబాద్ : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ బాలుడితో సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం మండలం చెల్లూరు వద్ద సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రమాద వివరాల్లోకి వెళితే.. మూడు కుటుంబాలకు చెందిన 16 మంది యాత్రికులు వ్యాన్లో రాయగడలోని ఓ ఆలయ దర్శనానికి బయలుదేరారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేట, దెంకాడ మండలం బొడ్డవలస, విజయనగరం మండలం చెల్లూరు గ్రామాలకు చెందిన వీరంతా చెల్లూరు వద్ద వ్యాన్ ఎక్కారు. వాహనం రోడ్డు పక్కన నిలిపి ఉంచిన సమయంలో, విశాఖపట్నం నుంచి అతివేగంగా వచ్చిన ఓ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు వ్యాన్ను ఆ లారీ సుమారు 500 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది.
ఈ ప్రమాదంలో చింతపల్లి రాంబాబు అలియాస్ రామునాయుడు (50), మజ్జి నారాయణరావు (50), బి. మోహననాయుడు (8) అనే బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు, క్షతగాత్రులంతా వృత్తిరీత్యా పెయింటర్లుగా (రోజువారీ కూలీలు) పోలీసులు గుర్తించారు. స్నేహితులైన వీరంతా కలిసి తీర్థయాత్రకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి కాళ్లు విరగగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై రూరల్ ఎస్సై అశోక్ కుమార్ కేసు నమోదు చేసి, వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.


