విద్యాసంస్థలు ప్రారంభం కాకముందే ఫీజుల రెగ్యులేషన్ కమిటీలను  నియమించాలి

నవతెలంగాణ – పెద్దవూర
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల్లో  ఇష్టరాజ్యంగా ఫీజులను వసూలు చేస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని దీనిని అరికట్టడానికి ప్రైవేటు విద్యాసంస్థలకు సంబంధించిన ఫీజులను నియంత్రణ చేసే రెగ్యులేషన్ కమిటీలను నియమించి దోపిడీని అరికట్టాలని సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి ఆదివారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలలో ఎక్కువగా నిబంధనలు ఉల్లంఘన ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు చేస్తున్నాయన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల ఏర్పాటు సమయంలో అనుమతి పొందే క్రమంలో ప్రభుత్వ విద్యాశాఖ నిర్దేశించిన విధంగా విద్యాశాఖ ఆదేశాలను,నిబంధనలను తూచ తప్పకుండా పాటిస్తామని అర్హత గల వారితో మెరుగైన విద్యా బోధన చేయిస్తామని, విశాలమైన క్లాస్ రూములు, క్రీడా ప్రాంగణాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలలో మౌలిక వసతులు కల్పిస్తామని చేప్పి విద్యార్థుల ను మోసం చేస్తున్నారని తెలిపారు.మెమోరియల్, సొసైటీ, ,ఫౌండేషన్ పేరుతో అనుమతులకు  దరఖాస్తులు చేసుకుంటారని అనుమతులు పొందిన క్షణం నుండి విద్యాశాఖ ఆదేశాలను తుంగలో తొక్కి, నిబంధనలకు నీళ్లు వదిలి పక్కా వ్యాపారంగా దోచుకోవడానికి అనుమతులు ఇచ్చినట్టుగా విద్యాసంస్థలను అధిక లాభాలను ఆర్జించే వ్యాపారంగా నిర్వహిస్తున్నారని అన్నారు. సౌకర్యాల కల్పన విషయంలో నిర్లక్ష్యం, ప్రచారంలో ఆర్భాటం, ఆకర్షణీయమైన పేర్లతో  స్కూల్ లకు పేర్లు పెట్టడం,  ఫీజుల వసూల్ల  విషయంలో ఒకరిని మించి ఒకరు పోటీపడి పడి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు.
సేవ పేరుతో అనుమతి పొందిన విద్యాసంస్థలు విద్యాసంస్థల నిర్వహణకు అయ్యే ఖర్చులను జీతభత్యాలను లెక్కించి కేవలం 05 శాతం  అదనంగా ఆదాయం వచ్చేటట్టు మాత్రమే ఫీజులు వసూలు చేయాలనే నిబంధన ఉన్నదనే విషయం పట్టించుకోవడం లేదని తెలిపారు.దీనిని అనుసరించి ప్రతి ప్రైవేటు విద్యాసంస్థ ప్రతి సంవత్సరం ఆదాయ వ్యయంల  రిపోర్టును విద్యాశాఖకు అందజేయాలనీ ఉన్న ఆదేశాలను పట్టించుకున్న దాఖలాలు లేవని తెలిపారు.ప్రైవేట్ విద్యాసంస్థలు తప్పనిసరిగా వారు వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను తరగతుల వారీగా విడివిడిగా నోటీసు బోర్డు నందు వివరాలు ప్రదర్శనగా ఉంచాలన్నారు.పాఠశాలలు ప్రారంభం కాకముందే అన్ని విద్యాసంస్థలలో తరగతుల వారీగా వసూలు చేయు ఫీజులను నిర్ధారణ చేసి అట్టి ఫీజులు అమలయ్యే విధంగా చూడడానికి ఫీజుల రెగ్యులేషన్ కమిటీలను త్వరగా నియమించాలని సమాచార హక్కు వికాస సమితి ప్రజల పక్షాన కోరుతున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాలు లేని విద్యా సంస్థల విషయంలో కఠినంగా వ్యవహరించి ఆహల్లదకరమైన వాతావరణంలో విద్యార్థులకు ఒత్తిడి లేని విధానాల్లో విద్యాబోధన జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ విద్యాశాఖపైన ఉందని దీని  విషయంలో సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.
Spread the love