నవతెలంగాణ – హైదరాబాద్ : మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో విషాదం చోటుచేసుకుంది. నెల రోజుల వయసున్న నాలుగు చీతా కూనలు మంగళవారం ఉదయం మృతి చెందాయి. వేరే జంతువు దాడి చేయడం వల్లే ఇవి చనిపోయి ఉంటాయని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. షియోపూర్ జిల్లాలోని కునో పార్కులో మానిటరింగ్ బృందం ఈ విషయాన్ని గుర్తించింది. కేజీపీ12 అనే ఆడ చీతా ఏప్రిల్ 11న ఈ నాలుగు కూనలకు జన్మనిచ్చింది.
మే 11వ తేదీ సాయంత్రం వరకు ఇవి ఆరోగ్యంగానే కనిపించాయని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో వీటి డెన్ సమీపంలో కళేబరాలను గుర్తించామని, అవి పాక్షికంగా తినివేసి ఉన్నాయని వివరించారు. తల్లి చీతా మాత్రం క్షేమంగా, ఆరోగ్యంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. పోస్ట్మార్టం నివేదిక, పూర్తి స్థాయి విచారణ తర్వాత మరణానికి కచ్చితమైన కారణాలు తెలుస్తాయని వారు పేర్కొన్నారు.


