వరంగల్‌లో నాలుగేండ్ల బాలుడి విక్రయం…

నవతెలంగాణ – వరంగల్: వరంగల్‌ నగరంలో నాలుగేళ్లు బాలుడిని కన్నతండ్రే అమ్మేశాడని విషయం కలకలం రేపింది. కన్న కొడుకు అని చూడకుండా డబ్బుల కోసం తండ్రి ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడంటూ ప్రచారం జరిగింది. మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు అందడంతో రంగంలో దిగారు. వివరాలిలా ఉన్నాయి. కరీమాబాద్‌కు చెందిన మసూద్‌ తన నాలుగేళ్ల కుమారుడు అయాన్‌ను అమ్మాడని అదే ప్రాంతానికి చెందిన అతడి బావమరిది అక్బర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు బాలుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు దర్యాప్తులో భాగంగా తండ్రి మసూద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే తన కొడుకును అమ్మలేదని, పోచమ్మమైదాన్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు పెంపకం కోసం ఇచ్చానని మసూద్‌ చెబుతున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా ఈ కేసు మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌ నుంచి మట్టెవాడ స్టేషన్‌కు బదిలీ అయినట్లు తెలుస్తోంది.

Spread the love