నవతెలంగాణ-మద్నూర్
ఇటీవల జుక్కల్ నియోజకవర్గ వ్యాప్త మండలాల్లో వరుస ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలను ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లచ్చన్ గ్రామానికి చెందిన దత్తు తన ఇంట్లో 5 గ్రాముల బంగారం, రూ.15,000 నగదు చోరికి గురైనట్టు మద్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నామనీ, దర్యాప్తులో భాగంగా నిందితుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. శనివారం సలాబత్పూర్ చెక్ పోస్టు వద్ద ఎస్ఐ మోహన్ రెడ్డి వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అటుగా అనుమానాస్పదంగా ఓ బైక్ పై వచ్చిన వ్యక్తిని ఆపి విచారణ చేశామని తెలిపారు. ఇందులో భాగంగా లచ్చన్ గ్రామంలో దొంగతనానికి పాల్పడింది మేమే అని అంగీకరించాడని పేర్కొన్నారు.
మరికొందరితో కలిసి వరుస ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు చేస్తుంటామని వెల్లడించాడని తెలిపారు. తన మిత్రులైన భీమ్రావు, అర్జున్, సుభాష్, కరీం, సునీల్ లతో కలిసి ముఠాగా ఏర్పడి మద్నూర్, జుక్కల్, పెద్దకొడపగల్, బిచ్కుంద, పిట్లం మండలాల్లో ట్రాన్స్ఫార్మర్ లను అపహరించి, అందులోని కాపర్ ను ఔరంగాబాద్ లో విక్రయిస్తామని ఒప్పుకున్నట్టు చెప్పారు. అనంతరం వచ్చిన సొమ్మును అందరం సమానంగా పంచుకుంటామని వివరించారని తెలిపారు. అయితే భీమ్ రావుపై ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 22 ట్రాన్స్ఫార్మర్ చోరీ కేసులు నమోదైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని చెప్పారు. భీమ్రావు, అర్జున్, సునీల్, కరీం, సుభాష్ లను అరెస్టు చేశామన్నారు.
పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు: వరుస ట్రాన్స్ఫార్మర్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను సాంకేతిక ఆధారాలతో గుర్తించి, నిందితులను అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన మద్నూర్ ఎస్ఐ మోహన్ రెడ్డి, పిట్లం ఎస్ఐ, పెద్దకొడపగల్ ఎస్ఐలు, కానిస్టేబుళ్లు విఠల్, విష్ణు, వెంకటేశ్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.



