
గత రెండు రోజుల నుండి రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సీపీఐ జిల్లా ఆఫీస్ కామ్రేడ్ ధర్మబిక్షం భవనంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కెట్ కల్లాలలో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి పోయిందని, పండ్ల తోటలు మామిడి సపోటా బొప్పాయి తదితర కాయలు ఈదురు గాలులకు నేలమట్టమై తీవ్ర నష్టం వాటిలిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నందున ప్రభుత్వ అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి అంచనాలను ప్రభుత్వానికి అందించాలని వారు అధికారులను కోరారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి రైతులను కాపాడాలని ఆయన అన్నారు. సన్న రకం దొడ్డు రకం అని తేడా లేకుండా రూ.500 రూపాయలు బోనసును వెంటనే అందజేయాలని అన్నారు. ఈనెల 27న జరిగే గ్రాడియేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అనంతల మల్లేశ్వరి, గీత పనివారాల జిల్లా అధ్యక్షులు కొండ కోటయ్య, ఎక్స్ సర్పంచ్ నంద్యాల రాంరెడ్డి సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపగాని రవి తదితరులు పాల్గొన్నారు.