– పాలమాకుల సర్పంచ్ పంతంగి సుష్మ రాజ్ భూపాల్
– కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్
– 24 నుంచి జూన్ 22వ తేదీ వరకు కంటి వెలుగు
నవతెలంగాణ-శంషాబాద్
కంటి వెలుగు కార్యక్రమంలో కండ్లు పరీక్షించి అవసరం ఉన్నవారికి శస్త్ర చికిత్సలు చేయించడానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని మండల పరిధిలోని పాలమాకుల గ్రామ సర్పంచ్ పంతంగి సుష్మా రాజ్ భూపాల్ అన్నారు. ఈ నెల 24నుంచి జూన్ 22 వరకు గ్రామంలో 22 రోజులపాటు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పెద్ద షాపూర్ మెడికల్ ఆఫీసర్ ప్రభాకర్ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పాలమాకుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం గ్రామ సర్పంచ్ పంతంగి సుష్మ రాజ్ భూపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కంటి వెలుగు నిర్వహణకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి రీడింగ్ కళ్లద్దాలు వెంటనే ఇస్తున్నారని, వివిధ రకాల దష్టి లోపం ఉన్నవారికి కళ్ళద్దాలు తయారుచేసి వారం పది రోజుల్లో అందజేస్తారని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వైద్యులు పరీక్షించి ఆపరేషన్ అవసరం ఉన్న వారిని మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ అవసరమని చెప్పి నగరంలోని సరోజినీ ఆసుపత్రికి సిఫార్సు చేస్తున్నారని తెలిపారు. పేదరికంలో ఉంటూ కళ్ళు కనిపించని సాధారణ ప్రజలు కుటుంబాల ఆదరణ నోచుకోని వారు దినసరి కూలీలు ఆపరేషన్ చేసుకోవడానికి ప్రయాణ ఖర్చులు కూడా లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సొంత ఖర్చులు భరించి కంటి ఆపరేషన్లు చేసుకోడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వమే ముందుకు వచ్చి పాలమాకుల గ్రామం నుంచి ఆపరేషన్ అవసరం ఉన్నవారిని గుర్తించి వారందరినీ నగరంలోని సరోజినీ హాస్పిటల్ తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్లు చేయించాలని కోరారు. అందుకు అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వం భరించాలన్నారు. లేదంటే తమ వంతుగా కంటి ఆపరేషన్లు చేయించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గుడాల ఇందిరా కష్ణ, ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శశిధర్ రెడ్డి, డీఈఓలు ప్రమీల, స్వాతి ఆప్తాలమిస్ట్ డాక్టర్ రాహుల్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉస్మాన్, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వమే ఆపరేషన్లు చేయించాలి
మాకు కండ్లు కనపడవు. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కండ్లు కనపడక హైదరాబాద్ వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురైతే ఎవరు బాధ్యత తీసుకుంటారు. పాలమాకుల నుంచి హైదరాబాద్ వెళ్లి ఆపరేషన్లు చేయించుకునే స్థితిలో మేము లేము. ప్రభుత్వమే మానవతా దక్పథంతో కంటి ఆపరేషన్లు చేయించాలి. గ్రామం నుంచి ప్రభుత్వం వెహికిల్ ఏర్పాటు చేసి ఆపరేషన్ అవసరం ఉన్న వారినిని ఆస్పత్రికి తీసుకువెళ్లి ఆపరేషన్ అనంతరం గ్రామానికి తీసుకురావాలి.
పాలామాకుల గ్రామస్తులు ఎన్. సత్యనారాయణ గౌడ్ , అంజయ్య ,అండాలు