ఆరోగ్యమే మహా భాగ్యం

Health is a great blessing– సుందరయ్య వర్ధంతి సందర్భంగా నవతెలంగాణ సాహితీ సంస్థ, సుప్రజా హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నవతెలంగాణ-సిటీబ్యూరో
మన ఆరోగ్యమే మనకు రక్షణనిస్తుందని నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్‌ అన్నారు. ఆరోగ్యంగా ఉండడం ద్వారా అన్ని పనుల్లో చురుగ్గా ఉంటామని తెలిపారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా శనివారం శ్రీవిద్య ఫౌండేషన్‌, సుప్రజ హాస్పిటల్‌, నవతెలంగాణ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి ఎంహెచ్‌ భవన్‌లోని మల్లు వెంకట నరసింహారెడ్డి ప్రజా వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం బీపీ, షుగర్‌, ఈసీజీ, బ్లడ్‌ గ్రూపింగ్‌ అండ్‌ టెస్టింగ్‌, చర్మ వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనారోగ్యంతో ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార పదార్థాలపై వైద్యులు వివరించారు. దాదాపు 200 మంది ఈ ఉచిత మెడికల్‌ క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు. జనరల్‌ ఫిజీషియన్‌ ఘట్‌కేసర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, ఎమర్జెన్సీ ఫిజీషియన్‌ డాక్టర్‌ రాజేందర్‌, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ నిఖిత, డెంటల్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ తేజస్విని, నర్సింగ్‌ సూపరింటెం డెంట్‌ ఎలిజబెత్‌, స్కిన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ నీలిమ, డాక్టర్‌ రమాదేవి వైద్య సేవలు అందించారు. ఈ వైద్య శిబిరాన్ని సుప్రజ హాస్పిటల్‌ జీఎం అజయ్ కుమార్‌, ఏజీఎంలు మహ్మద్‌, మాధవిరెడ్డి (ఆపరేషన్స్‌) పర్యవేక్షించారు. అనంతరం సుప్రజ హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయ్ కుమార్‌ను ‘నవతెలంగాణ’ సీజీఎం ప్రభాకర్‌ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ వీరయ్య, హెచ్‌ఆర్‌ ప్రభాకర్‌, కిషన్‌, రాములు, హాస్పిటల్‌ ఇన్‌చార్జి విజయ్ కుమార్‌ పాల్గొన్నారు.

Spread the love