– పేరు మార్చిన యాజమాన్యం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీ పేరు టీజీఎస్ఆర్టీసీగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీగా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లను ‘టీజీ’ గా మార్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ఇప్పటికే రాష్ట్రంలోని జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలు తమ పేర్లకు ముందు టీఎస్ను తొలగించి, టీజీగా మార్చాయి. తాజాగా టీఎస్ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీగా మారుస్తున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆ మేరకు అధికారిక ‘ఎక్స్’ ఖాతాల పేర్లను gsrtcmdoffice@tgsrtch గా మార్చింది. ప్రజలు తమ సలహాలు, సూచనలు, ఫిర్యాదులను పేరు మార్చిన ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఇదే పేరుతో ఉన్న అధికారిక ‘ఎక్స్’ను ఫాలో కావాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే అన్ని ఆర్టీసీ డిపోల పేర్లనూ టీజీఎస్గా మారుస్తామని తెలిపారు.