– అంగన్వాడీలో వర్షపు నీరు
నవతెలంగాణ -ముధోల్ : నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, పలు చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. వ్యవసాయ పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పత్తి, సోయాబీన్, కంది తదితర పంటలు నీటమునిగాయి.మండల కేంద్రంలోని సాయి మాధవ్ నగర్ కాలనీలో వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో నీటి కోసం ఎదురుచూసిన చెరువులు ప్రస్తుతం జలకళను సంతరించుకుని నిండుకుండలను తలపిస్తున్నాయి.
భారీ వర్షాల ప్రభావంతో మండలంలోని వాగులు, ఉప్పొంగి ప్రవహించాయి ముద్గల్ గ్రామ సమీపంలోని లోలెవల్ వంతెనపై వరద నీరు ప్రవహించాయి. రాకపోకలకు కొంతమేర అంతరాయం కలిగింది.ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీఓ లవకుమార్ , పంచాయతీ కార్యదర్శి ఆనందరావు,లు పరిశీలించారు. లో లేవల్ వంతెన నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకపోకలు సాగించవద్దని ప్రజలను హెచ్చరించారు. ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నందున వరద నీటిని దాటేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని సూచించారు. పలు గ్రామాల్లో రహదారులపై వర్షపు నీరుప్రవహిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
తహసీల్దార్ శ్రీలత సీఐ రవీందర్ నాయక్, ఎంపీడీఓ లవకుమార్ లు సూచించారు . అత్యవసర పరిస్థితులు, మినహా ప్రజలు బయటకు రావద్దని, వాగులు, వంకలు, చెరువులు, నదుల వద్దకు వెళ్లకూడదని కోరారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని వారు అన్నారు. వరద నీటీతో రువ్వి గ్రామంలో చెరువు పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో తాసిల్దార్ శ్రీలత వెంటనే గ్రామానికి వెళ్లి చెరువును పరిశీలించారు. చెరువు నీటిని తూము ద్వారా నీటిని విడుదల చేశారు. వరద నీరు మళ్లింపు తో చెరువుకు ముప్పు తప్పింది. అలాగే బోరేగాం గ్రామంలో వర్షం నీరు అంగన్వాడి భవనం లోకీ చేరాయి. దీంతో అంగన్వాడిలో ఉన్న వంట సరుకులు, పోషకాహారం బస్తాలు వేరే గదికీ తరలించారు. అంగన్వాడి కేంద్రాన్ని తాత్కాలికంగా స్థానిక పాఠశాల లో ఓ గదిలో కొనసాగించాలని తాసిల్దార్ సూచించారు.భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని తాసిల్దార్ తెలిపారు.



