ఓఆర్‌ఆర్‌ టోల్‌ టెండర్లపై విచారణ

అవుటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) టోల్‌ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి– నివేదిక వచ్చాక సీబీఐ, లేదా మరో సంస్థతో దర్యాప్తు
– రీజినల్‌ రింగ్‌ రోడ్డు వరకు హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణ
– లే అవుట్లలోని ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు
– హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ దుబారు మోడల్‌ టూరిజం స్పాట్లు : హెచ్‌ఎండీఏ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అవుటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) టోల్‌ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో హెచ్‌ఎండీఏ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారంటూ అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయముంది? ఏయే సంస్థలున్నాయి? అనే విషయాలపై దర్యాప్తు జరపాలని ఆదేశించారు. టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ అమ్రా పాలీకి ఆ బాధ్యతలు అప్పగించారు. టెడర్లలో ఫైళ్లు ఏవైనా మిస్సయినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. టెండర్ల కేటాయింపుపై పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినేట్లో చర్చించి సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు విచారణ బాద్యతలు అప్పగిస్తామని సీఎం చెప్పారు. టెండర్లకు ముందు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రతి నెలా గరిష్ఠంగా ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం వచ్చేదని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. 30 ఏండ్ల లీజు గడువులో రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం రావాల్సి ఉండగా, కేవలం రూ.7,380 కోట్లకు ఐఆర్‌బీ కంపెనీకి ఎలా అప్పగించారంటూ ముఖ్యమంత్రి ఆరా తీశారు. హెచ్‌ఎండీఏ అనుసరించిన టెండర్‌ విధానంతోనే ప్రభుత్వం రూ.15 వేల కోట్లకుపైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేయిస్తేనే, నిజాలు బయటకు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. టెండర్‌ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్‌ను చూపించి 49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందనీ, ఆ కంపెనీతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని రేవంత్‌ అధికారులను ఆదేశించారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌ గా తీసుకుని హైదరాబాద్‌ అభివద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు రేడియల్‌ రోడ్లు నిర్మించాలని చెప్పారు. ఇప్పటికే అభివద్ది చెందిన సిటీతో పాటు కొత్తగా విస్తరిస్తున్న శివారు మున్సిపాల్టిల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. మాస్టర్‌ ప్లాన్‌-2050కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో సిటీ అభివద్ధికి విజన్‌ డాక్యుమెంట్‌ ను రూపొందించాలని సీఎం సూచించారు.
హెచ్‌ఎండీఏ ఆస్తుల రక్షణకు చర్యలు
హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, భూములు అన్యాక్రాంతం కాకుండా డిజిటల్‌, జీపీఎస్‌ విధానాలతో మ్యాపింగ్‌ చేసి పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. సంస్థ ఆస్తులు ఆక్రమణకు గురి కాకుండా డీఐజీ స్థాయి ఐపీఎస్‌ అధికారినీ, ఇద్దరు ఎస్పీ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలనిసూచించారు. ల్యాండ్‌ ఫూలింగ్‌ స్థలాల అభివృద్ది విషయంలో జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకుని సమన్వయంతో పని చేయాలని సూచించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న 8,374 ఎకరాల ల్యాండ్‌ పార్శిళ్లలో 2,031 పార్శిళ్లు వివిధ స్థాయిల్లో కోర్టు కేసుల్లో ఉన్నవాటిపై దృష్టి పెట్టాలన్నారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌ తదితర పట్టణాలన్నింటా లే అవుట్లలో కమ్యూనిటీ అవసరాలకు ఇచ్చిన స్థలాలు తమ అధీనంలో ఉన్నాయా? లేదా ఆక్రమణకు గురయ్యాయా? అనే అంశంపై వెంటనే సర్వే చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పాఠశాలల ఏర్పాటుకు ముందుకొచ్చే కార్పేరేట్‌ కంపెనీలు, పేరొందిన పాఠశాలల యాజమాన్యాలకు వీటిని అప్పగించాలని సీఎం సూచించారు. ఆ ప్రాంతంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు కనీసం 25 శాతం కోటా అందేలా చర్యలు చేపట్టాలన్నారు.
టూరిస్టు స్పాట్ల అభివృద్ధికి చర్యలు
హుస్సేన్‌సాగర్‌తో అంబేద్కర్‌ విగ్రహం, ఎన్టీఆర్‌ పార్కు, తెలంగాణ అమరుల జ్యోతి, అటు నెక్లెస్‌ రోడ్డు నుంచి ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు వరకు మొత్తాన్ని ప్రపంచ స్థాయి సందర్శ నీయ ప్రాంగణంగా తయారు చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. హుస్సెన్‌ సాగర్‌ చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆక్రమణ లను తొలిగించి, పర్యాటకులు, సిటీ ప్రజలు తీరికవేళలో ఆనందంగా గడిపేలా ఈ ప్రాంతాన్ని రూపొందించాలని సీఎం అధికారులకు వివరించా రు. దుబారు తరహాలో స్కై వాక్‌ వే, ఫుడ్‌ స్టాళ్లు, చిల్డ్రన్‌ అమ్యూజ్మెంట్‌ జోన్‌, అభివద్ధి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, స్పెషల్‌ సెక్రెటరీ అజిత్‌ రెడ్డి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్మెంట్‌ ముఖ్యకార్య దర్శి దాన కిషోర్‌, ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love