ఇజ్రాయెల్‌పై కిల్లర్ డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడ్డ ఇరాన్!

Iran Drone Attackనవతెలంగాణ – హైదరాబాద్
సిరియాలో ఇరాన్‌ దౌత్యకార్యాలయంపై ఇజ్రాయెల్ దాడితో ఒక్కసారిగా వేడెక్కిన మధ్యప్రాచ్య పరిస్థితులు తాజాగా కీలకమలుపు తిరిగాయి. ఇజ్రాయెల్‌పై ప్రతికారం తప్పదని హెచ్చరిస్తున్న ఇరాన్ శనివారం ప్రతీకార దాడులకు దిగింది. 200 డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెలీ స్థావరాలపై దాడులకు దిగింది. మరోవైపు, ఇరాన్ వైపున్న వర్గాలు కూడా ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తున్నాయి. అయితే, తాము స్వీయరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్టు ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. ఈ వివాదం ఇక్కడితో ముగిసినట్టు తాము భావిస్తున్నామని తెలిపింది. ‘‘ఇరాన్ మొత్తం 200 కిల్లర్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైళ్లను తమపై ప్రయోగించింది’’ అని ఇజ్రాయెల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే, చాలా మటుకు డ్రోన్లు, మిసైళ్లను మార్గమధ్యంలోనే కూల్చేశామని తెలిపారు. అన్ని వైపులా సైనికులను మోహరించామని, ఇజ్రాయెల్ రక్షణ కోసం సర్వసన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విస్పష్ట ప్రకటన చేశారు. అంతకుమునుపు, భద్రత అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఇజ్రాయెల్ వైపు వస్తున్న డ్రోన్లు కూల్చేవేస్తున్నట్టు అమెరికా అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ స్వీరక్షణకు అన్నిరకాల సాయాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడారు. ఆత్మరక్షణతో పాటూ అవసరమైతే ప్రతిదాడులకు వెనకాడబోమని ఇజ్రాయెల్ ప్రధాని ఈ సందర్భంగా బైడెన్‌కు తెలిపారు. ఇలాంటి పరిస్థితి కోసం కొన్నేళ్లుగా తాము ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

Spread the love