నవతెలంగాణ – హైదరాబాద్
ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడట్టారన్న ఆరోపణలతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజిని ఇంటిపై ఏసీబీ అధికారులు పంజా విసిరారు. హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డి కాలనీలో ఉన్న ఆమె నివాసంలో బుధవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించారు. మరో ఐదు చోట్ల ఆమె సమీప బంధువుల ఇండ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. గతంలో రజిని పనిచేసిన ధర్మసాగర్లోనూ తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఇంటి స్థలా లు, వ్యవసాయ భూముల డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు, కొంత నగదు స్వా ధీనం చేసుకున్నారు. రూ.25 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ గుర్తించి, బ్యాంకు అధికారులకు సమాచారమిచ్చి సీజ్ చేయించారు. రజనీ అక్రమ ఆస్తుల వివరాలను కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మీడియాకు తెలిపారు. ప్రభుత్వ విలువ రూ.3.12 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో రూ.12 కోట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. ఇప్పటివరకు రూ.12 కోట్ల అక్రమ ఆస్తుల్లో రెండు అంతస్థుల భవనం, 21 ప్లాట్లు, ఏడు ఎకరాల వ్యవసాయ భూమి, 25 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, కిలోన్నర బంగారు అభరణాలు, రెండు కార్లు, మూడు బైక్లు, లక్షన్నర నగదు ఉన్నాయని పేర్కొన్నారు. సోదాల అనంతరం రజినిని అరెస్ట్ చేసి, కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో ఆమెను రిమాండ్కు తరలించారు.