నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ సైన్యం లెబనాన్ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. బుధవారం బీరూట్ – దక్షిణ లెబనాన్ని కలిపే ప్రధాన రహదారిపై వెళుతున్న కార్లపై ఇజ్రాయిల్ సైన్యం మూడుసార్లు డ్రోన్ల దాడికి పాల్పడింది. దీంతో ఇద్దరు చిన్నారులతో సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ విషయాన్ని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. లెబనాన్ రాజధాని బీరూట్కి దక్షిణంగా సుమారు 20 కిలోమీటర్ల (12 మైళ్ల) దూరంలో ఉన్న జియే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇజ్రాయిల్ పాల్పడిన డ్రోన్ల దాడికి కార్లు ధ్వంసమయ్యాయి. ఈ బాంబు దాడికి కార్ల బాహ్యభాగాలు కాలిపోయి, ముక్కలయిపోయాయి వీటికి సంబంధించిన ఫొటోలను లెబనాన్ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ దాడులు మరింత ఉద్రిక్తతలకు కారణమవుతాచపి ఆల్జజీరా ప్రతినిధి జైనా ఖోద్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, లెబనాన్, ఇజ్రాయిల్ బహుశా అమెరికా మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్లో గురువారం మరో దఫా చర్చలు జరగనున్నాయి. అయితే హెజ్బల్లా అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగే చర్చలను వ్యతిరేకిస్తోంది. మరోవైపు బుధవారం ఉదయం ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్లోని మీస్ ఎల్-జబల్, యానూహ్, బుర్జ్ షెమాలి, హులా, డెబ్ల్, అబ్బాసియ్యే ఆరు గ్రామాలు నివాసితులను బలవంతంగా తమ గ్రామాలను వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించింది. అక్కడి నుంచి వెళ్లకపోతే నివాసితులను బలవంతంగా తరలిస్తామని, ఆ గ్రామాల నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలోకి వెళ్లాలని, లేకపోతే తమ ప్రాణాలను ప్రమాదంలోకి పడేసుకున్నట్లేనని ఇజ్రాయిల్ బెదిరించింది.



