అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించనున్న ఇస్రో..!

నవతెలంగాణ- హైదరాబాద్: చంద్రయాన్-3 విజయం అందించిన ఉత్సాహంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరింత సమున్నత లక్ష్యాల దిశగా దూసుకెళుతోంది. సమీప భవిష్యత్తులో అంతరిక్షంలో ఓ స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ తాజాగా ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. భవిష్యత్తులో వివిధ రకాల మిషన్లు చేపట్టబోతున్నట్టు తెలిపారు. స్పేస్ స్టేషన్, దీర్ఘకాలం ప్రయాణించగలిగే మానవసహిత స్పేస్ ఫ్లైట్ ఆ జాబితాలో ఉన్నాయన్నారు. స్పేస్ స్టేషన్‌ భారత ఆర్థిక వ్యవస్థకు ఏ విధమైన లాభం చేకూరుస్తోందో పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇస్రో గగన్‌యాన్‌పై దృష్టి సారించింది. ఆ తరువాత వ్యోమగాములను అంతరిక్షానికి పంపి, అక్కడ స్పేస్ స్టేషన్ నిర్మించాలనే యోచనలో ఉంది. రోబోటిక్ ఆపరేషన్‌తో ఈ ప్రక్రియ నిర్వహిస్తామని ఇస్రో చీఫ్ తెలిపారు. ప్రస్తుతం మానవ సహిత ఫ్లైట్ సామర్థ్యం భారత్‌కు లేనందున ఈ విషయంపై దృష్టి పెట్టామన్నారు.

Spread the love