పోలవరం విషయంలో జగన్‌ తప్పులు చేశారు

పోలవరం విషయంలో జగన్‌ తప్పులు చేశారు– చంద్రబాబు విమర్శ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సీఎం బాధ్యతలు చేపట్టిన అనంతం ఆయన తొలసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, కాపర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ పనుల పురోగతి వివరాలను జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..పోలవరం ప్రాజెక్టు కోసం నేను పడిన కష్టాన్ని జగన్‌ బూడిదలో పోసిన పన్నీరు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు కాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించాను. ప్రాజెక్టు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంలో టీడీపీ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తిచేశాం..15 లక్షల క్యూసెక్కులు స్పిల్‌వేపై డిశ్చార్జ్‌ అవుతాయని అన్నారు. రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టారు. ఏజెన్సీపాటు సిబ్బందినీ మార్చారు. డయాఫ్రమ్‌ వాల్‌ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు. పోలవరం విషయంలో జగన్‌ క్షమించరాని తప్పులు చేశారు. ఈ ప్రాజెక్టుపై నేను వందసార్లు సమీక్షించాను. 30 సార్లు సందర్శించా..రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రమ్‌ వాల్‌ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. గతంలో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని, అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగేండ్లు పడుతుందని అధికారులు అంటున్నారని చెప్పారు. ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో ఇదొక కేస్‌ స్డడీ..రూ. వేల కోట్ల ప్రజాధనం వృధా అయ్యింది. అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేది. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగింది. నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం రాష్ట్రానికి చెప్పింది. అలాగే మార్చితే ప్రాజెక్టుకు జవాబుదారీతనం ఉండదని చెప్పారు. ఏజెన్సీలను మార్చడమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణం. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు ? ప్రజలనే కాదు, మీడియాను, ప్రతిపక్ష నేతగా నన్ను కూడా ఇక్కడికి రానీయలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు అంతా క్లిష్టంగా మారిపోయింది..ఈ చిక్కుముడులు అన్నీ విప్పే ప్రయత్నం చేస్తున్నాం..ఈ ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని కలలు కన్నా. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి చెందిన ప్రాజెక్టు ఇది అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Spread the love