భారత క్రికెట్ అభిమానులకు జియో సినిమా శుభవార్త

నవతెలంగాణ – హైదరాబాద్:  క్రికెట్ అభిమానులకు జియో సినిమా మరోసారి శుభవార్త చెప్పింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడే వన్డేల సిరీస్ ను ఉచితంగా ప్రేక్షకులకు అందించనుంది. ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేసి జియో సినిమా ఈ మేరకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22, 24, 27వ తేదీల్లో భారత్, ఆసీస్ మధ్య మూడు వన్డేలు జరుగుతాయి. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్ ఇరు జట్లకు సన్నాహకంగా, కీలకంగా మారనుంది. మరోవైపు 2023 సెప్టెంబర్ నుంచి 2028 మార్చి వరకు భారత్ లో జరిగే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ టోర్నీల ప్రసార హక్కులను జియో కంపెనీకి చెందిన వయాకామ్18 సొంతం చేసుకుంది.  ఈ క్రమంలో భారత్-ఆస్ట్రేలియా సిరీస్ ప్రసారంతో ఐదేళ్ల కాలానికి ఈ హక్కులు మొదలతాయి. దాంతో, ఐపీఎల్ తరహాలో ఈ సిరీస్‌ను అందరికీ ఉచితంగా ప్రసారం చేయాలని జియో నిర్ణయించింది . మొత్తం 11 భాషల్లో ఈ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం కల్పించనుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, భోజ్‌పురి, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ భాషల్లో ఈ మ్యాచ్‌లను జియో సినిమా ప్రసారం చేయనుంది.

Spread the love