కేంద్రానికి టోర్నమెంట్ షెడ్యూల్ ప్రతిపాదన
క్రీడాశాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర ప్రభుత్వ బృందం
నవతెలంగాణ-హైదరాబాద్
ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 22 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ను ప్రతిపాదించింది. ఎనిమిదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆతిథ్య హక్కులు తెలంగాణకు దక్కటంతో.. ప్రతిష్టాత్మక పోటీలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ షెడ్యూల్, వేదికలు, స్టేడియాల ఆధునీకరణ, సదుపాయాల కల్పన సహా లాజిస్టిక్స్ వంటి ఇతర అంశాలను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు నివేదించారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, శాట్జ్ ఎండీ సోనిబాల దేవిలు గురువారం న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ షెడ్యూల్ ప్రతిపాదనను అందజేయటంతో పాటు క్రీడల ఆరంభ కార్యక్రమానికి మాండవీయ ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని మాండవీయ హామీ ఇచ్చారు.



