– విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా
– మూడు పర్యాయాలు ప్రజల ఎమ్మెల్యేగా సుస్థిర స్థానం
ఆయన క్రమశిక్షణ గల కమ్యూనిస్టు ఉద్దండుడు.. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల నాయకునిగా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు.. టెనెన్సీ యాక్టు సవరణ, గిరిజన, రైతు సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినా దంతో పార్టీ పిలుపునందు కుని శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేత మాజీ ఎమ్మెల్యే కెఎల్ నర్సింహారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును ఆయన సూచించినది ఆయనే.
టెనెన్సీ యాక్టు సవరణ, గిరిజన, రైతు సమస్యలపై కృషిసల్పిన యోధుడు
నవతెలంగాణ-ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని ఇల్లందు తాలూకా బేతంపూడి గ్రామంలో కొండపల్లి లక్ష్మీనర్సింహం (కేఎల్) జన్మించారు. ఆయన వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా కెఎల్.నర్సింహారావు ఆదర్శప్రాయులు. 1952లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపారు. 1957లో మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ప్రోగ్రెసీవ్ డెమోక్రటిక్ ఫ్రంట్(పిడిఎఫ్) నుంచి పోటీ చేసి హైదరాబాదు శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాడు సుందరయ్య ప్రతిపక్ష నేతగా, కెఎల్ ఉపనాయకునిగా పనిచేశారు. టెనెన్సీ యాక్టుకు సవరణకు ఆనాడు అసెంబ్లీలో కెఎల్ కృషి చేశారు. ఈ చట్టంలో 37, 37ఎ, 38ఈ సెక్షన్స్ ప్రవేశపెట్టించి కౌలుదారులకు మేలు చేశారు. 1962లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదంతో..
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాగిన ఉద్యమంలో పార్టీ నిర్ణయం మేరకు తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1956లో ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలను కలిపే సమయంలో ఆంధ్రప్రదేశ్ పేరును కెఎల్ సూచించారు. దానికే ఎక్కువ మంది మద్దతు తెలపడంతో ప్రభుత్వం ఫైనల్ చేసింది. దీంతో 1956 నవంబర్ ఒకటిన ఆధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.
అరుణ ప్రస్థానం సాగించిన కెఎల్
1926 జూన్ 26న ఇల్లందు తాలూకాలోని బేతంపూడి గ్రామంలో కొండపల్లి రాంకిషన్రావు- అన్నపూర్ణమ్మలకు కెఎల్ నర్సింహారావు జన్మించారు. జమిందారీ కుటుంబం అయినప్పటికీ అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, మంచికంటి రాంకిషన్రావు, సర్వదేవభట్ల రామనాథంతో పరిచయం.. తద్వారా 1944లో కెఎల్ కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఆంధ్రమహాసభలో చేరి రామనాథంతో కలిసి 1944లో వరంగల్లో ఆజాంజాహి మిల్ వర్కర్స్ యూనియన్ స్థాపించారు. 1945లో రెండో ప్రపంచ యుద్ద కాలంలో రైతు పోరాటం నిర్వహించి 13 నెలలపాటు జైలు జీవితం గడిపారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో..
కెఎల్ 15వ ఏటనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. చిన్నపిల్లవాడని పోలీసులు పొమ్మంటే ”నేను పొట్టిగా ఉండి అలా కనపడుతున్నాను.. నాకు 20ఏండ్లు” అనడంతో జైల్లో వేశారు. 13 నెలలపాటు జైలు జీవితం గడిపారు. దొడ్డి కొమరయ్య బలిదానం వార్త విని చలించిపోయి జైలు గోడల మధ్యనే పాట రాశారు. కెఎల్ భార్య దుర్గాదేవి, కుమారులు, కూతురు, కోడళ్ళను మార్క్సిస్టు ఉద్యమపథంలో నిలిపారు. 2011 మార్చి 17న ఖమ్మంలో కన్నుమూశారు. ఆయన జీవితం నేటి తరం ప్రజలకు ఆదర్శప్రాయం.