రాహుల్ తో కోదండరాం భేటీ … పొత్తులపై ?

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ తో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చ జరగలేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. కరీంనగర్ లో  రాహుల్ గాంధీతో భేటీ అయిన అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని రాహుల్  కోరినట్టు చెప్పారు. తెలంగాణలో నిరంకుశ పాలన పోవాలనే అభిప్రాయాన్ని రాహుల్ వ్యక్తం చేశారని తెలిపారు. కాంగ్రెస్ బస్సుయాత్ర సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోదండరాం కలిశారు. కరీంనగర్ వీపార్క్ హోటల్ లో వీరు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని రాహుల్  కోరినట్టు చెప్పారు కోదండరాం. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రెండు మూడు చోట్లలో సీట్లను కోదండరాం అడుగుతున్నట్టు తెలుస్తోంది.  కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముదోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను జనసమితి ఆశిస్తుంది.

Spread the love