బోరబండ ఇబ్రహీం ఇంటికి కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరిన బోరబండకు చెందిన ఇబ్రహీం ఖాన్‌ ఇంటికి ఆదివారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెళ్లారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 2న ఆయన కేటీఆర్‌కు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. గత పది సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివద్ధి కోసం అద్భుతమైన పని చేశారనీ, దురదష్టవశాత్తు ఎన్నికల్లో గెలవలేదనిపేర్కొన్నారు. పదేండ్ల పాటు రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతిగా తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని ఆయన కోరారు. ఇచ్చిన హమీ మేరకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఈ సంధర్భంగా భోజనం చేశారు. ఇబ్రహీం ఖాన్‌ పిల్లలకు చెవుడుకు అవసరమైన చికిత్స ఖర్చులు అందించేందుకు కేటీఆర్‌ ముందుకొచ్చారు. ఒక సాధారణ పౌరుడు తమ ప్రభుత్వ సేవలకు గుర్తింపుగా ఇంటికి ఆహ్వానించడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని కేటీఆర్‌ తెలిపారు. ప్రజా జీవితంలో ఇలాంటి సంఘటనలు మరింత నిబద్ధతతో ప్రజల కోసం కష్టపడేలా స్ఫూర్తినిస్తాయని ఈ సందర్భంగా అన్నారు. కేటీఆర్‌ వెంట స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.

Spread the love