యాభై ఆరు అంగుళాల ఛాతి ఉందో లేదో తెలీదు గానీ, ఉన్నదాని నిండా గుండె నిబ్బరం ఉన్నట్టుంది. హిండెన్బర్గ్ నివేదిక టాయిలెట్ పేపర్ అయింది. కాగ్ నివేదికల నుండి కాచుకొస్తున్న తీరు చూసి ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. దేవుళ్ళను తన పక్కనే కొలువు తీర్చుకున్న తర్వాత ఈవీఎమ్లు కాషాయ శోభతో అలరారడం గ్యారంటీ అనే ధైర్యం ఉన్నది. ఇక బడ్జెట్లో ముక్కలో బొక్కలో విసరాల్సిన అవసరమేమొస్తుందని మోడీ బృందం భరోసా. దానికి తగ్గట్టుగానే నిన్నటి నిర్మలమ్మ ‘మధ్యంతర పద్దు’ ఉంది. 2022 -23 కంటే 2023 -24 రెవెన్యూ ఆదాయం 13.3 శాతం పెరిగినా ద్రవ్యలోటు తగ్గించడం పేర గత ఏడాది బడ్జెట్ అంచనాల కంటే కేంద్ర ప్రభుత్వ ఖర్చు కుదించి వేయబడింది. వ్యవ సాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, విద్య, వైద్య, సాంఘిక సంక్షేమంపైనా, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పీఎం కృషి సించాల్ యోజన వంటి వాటిపై గత బడ్జెట్ సంఖ్యలకంటే తక్కువే కేటాయించారు. ఆహార సబ్సిడీ, ఎరువులు, సబ్సిడీ, ఉపాధి హామీ నిధులన్నీ 2022 – 23 కంటే తగ్గించి వేయబడ్డాయి. జీడీపీ వృద్ధి 7.3 శాతం ఉంటుందనేది భూమ్మీదుండే అంచనా వేశారా? అనే సందేహం రాకతప్పదు. సర్కారు వారి అంచనా ప్రకారం ద్రవ్యోల్బణం 1.6శాతం ఉంటుందని అంచనా. వాస్తవానికి వినిమయ ధరల సూచీపై ఆధార పడ్డ ద్రవ్యోల్బణం 6 శాతం, దీన్లో ఆహార ద్రవ్యోల్బణం పది శాతం దాటింది.
ఇప్పటికే దేశంలో వృద్ధి ‘ఖ’ ఆకారంలో అంటే పేదలు మరింత పేదలవుతూంటే ధనికులు మరింత ధనికు లౌతున్నారని అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్నది నిజమని ఈ మధ్యంతర బడ్జెట్ మరింత రుజువు చేసింది. మోడీ బృందానికేమైనా భవిష్యత్ కన్పడే ఈ పద్దు తయారు చేశారో లేదో తెలియదు గానీ వీరి ప్రగల్భాలకి పరాకాష్టగా ఈ మధ్యంతర బడ్జెట్ను నిర్మలమ్మ ప్రజెంట్ చేసింది. 1950 నుండి 2014 వరకు ఒకటిగానూ, 2014 నుండి ఈ పదేండ్ల ”అభివృద్ధి” ఒకటిగానూ విడగొట్టి పద్దులు లెక్క కట్టారు. 2023- 24 దేశ అభివృద్ధి 3.7 లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని, రానున్న ఐదేండ్లలో ఇది ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెరు గుతుందని చెప్తున్నారు. 2030 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరిస్తుందని పేర్కొన్నారు. 2014 నాటికి ప్రపంచ దేశాల్లో అట్టడుగు ఐదు దేశాల్లో ఒకటిగా ఉన్న భారతదేశం మోడీ వల్ల ఈ స్థాయికి పెరిగిందని చెప్పుకుంటున్నారు. పెరగటం మంచిదే కావచ్చు, దాని వల్ల సామాన్యులకు ఒరిగేదేంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వాళ్ల ఊర్లో మిరియాలు తాటికాయలంత ఉంటాయని చెప్తే జనం తాము చెవుల్లో పెట్టిన కమలం పూల వల్ల నమ్మి తీరతారనే అతి విశ్వాసంలో ఉన్నారు కాషాయ నేతలు.
ప్రభుత్వ రంగ పరిశ్రమలను ధ్వంసం చేయడంలో తామే మొనగాళ్లమని చెప్పుకుంటూ రూ.4.09 లక్షల కోట్ల ప్రభుత్వ రంగ షేర్లను అమ్మేశామని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు. 2025లో మరో రూ.50 వేల కోట్ల షేర్లను అమ్మేస్తారట. దేశాన్ని, దేశంలో 75 ఏండ్ల పాటు నిర్మించిన ఆస్తులను అమ్మేయడం కూడా ఘనకార్యంగా చెప్పుకోవడం మోడీ ప్రభుత్వానికే చెల్లింది. అటు రాష్ట్ర పతి ప్రసంగంలోనూ, ఇటు నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలోనూ మోడీ లక్ష్యాలు యువత, మహిళలు, రైతులు, పేదల గురించి నామస్మరణం చేశారు. పేదరికాన్ని నిర్మూలించేశామని చెప్పుకోవడానికి ఈ పాలకులకు నోరెలా వచ్చిందో అర్థం కాదు. ఐక్యరాజ్యసమితి పేదరిక సూచీలో భారతదేశ స్థితి అధ్వాన్నంగా ఉందన్న విషయం మన కళ్లెదుటే ఉంది. ఐఎల్ఓ లెక్క ప్రకారం మన దేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో నిజ వేతనాలు పడిపోవడాన్ని లెక్క తేలిస్తే ఇక పేదరికం ఎలా పడిపోయిందో ఈ పాలకులే చెప్పాలి. నాడు వస్తూ వస్తూ తెలంగాణాకు అన్యా యం చేసిన బీజేపీ నేడు పోతూ పోతూ కూడా దాన్నే కొనసాగించింది. విభజన హామీల ఊసే లేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కలికానికి కూడా కానరావు. అంకెలు, సంఖ్యలు ఎలా ఉన్నా, అయోధ్య దెబ్బతో దేశంలో రామనామం కంటే మోడీ నామస్మరణే మిన్నంటిన వేళ ఓట్లేసే సామాన్యులను భక్తిరసంలో ముంచెత్తి, మైనార్టీలను కత్తులతో కంట్రోల్లో పెడితే ఈడీ, సీబీఐతో ప్రతిపక్షాలను బెదిరించి, మళ్లీ గట్టెక్కాలనుకునే ఆత్రుతతో ఉన్న కమలనాథులకు ఇదే చివరి బడ్జెట్ చేయాలి.