నవతెలంగాణ-రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని జీఆర్ఎం టౌన్షిప్, గద్దెరేగడి ప్రాంతంలో గోల్డ్ చోరీ జరిగింది. మహమ్మద్ అమీర్ ఖాన్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, మహమ్మద్ అమీర్ ఖాన్ తన ఇంటికి తాళం వేసి గురువారం ఉదయం గోదావరిఖనిలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. అనంతరం తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి మెయిన్ డోర్ పక్కన ఉన్న గ్రిల్ తొలగించి.. లోపలికి ప్రవేశించిన దుండగులు బీరువాలో ఉన్న సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను అపహరించినట్లు గుర్తించారు.
బాధితుడు వెంటనే రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ జె. శ్రీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ పర్స రమేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు ప్రకటనలో తెలిపారు.



