నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ను వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఎల్బీనగర్ నియోజకవర్గంలో ‘నా బూత్- నా భవిష్యత్తు’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక బాలికకు అన్యాయం జరిగితే ప్రభుత్వం మిన్నకుండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బాలికకు అన్యాయం చేయాలని చూశాయని, కానీ, ఆమెకు న్యాయం జరగాలని నిలబడి పోరాడింది బీఆర్ఎస్ పార్టీయే తెలిపారు. బీఆర్ఎస్, అనుబంధ సంఘాల పోరాటం వల్లే బాలికకు కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చిందన్నారు.
ప్రధానమంత్రి మోడీ ‘బేటీ పడావో.. బేటీ బచావో’ అంటున్నారు. ఇది కేవలం నినాదాలకే పరిమితమైందని అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన నిందితుడిని దాచి ఉంచి, బాధితురాలి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసింది కేంద్రమంత్రే అని తెలిపారు. ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగడం తెలంగాణకే కాదు.. భారత దేశానికే అవమానకరమని ఆయన అభిప్రాయపడ్డారు.


