చామల కిరణ్ కుమార్ రెడ్డిని లక్ష మెజారిటీ తో గెలిపించండి 

నవతెలంగాణ – చండూరు  
భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే  చామల కిరణ్ కుమార్ రెడ్డిని  మునుగోడు నియోజకవర్గం నుండి  లక్ష మెజార్టీ ఇవ్వాలని  భువనగిరి  ఇంచార్జి,మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజాగోపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నాపై నమ్మకంతో  కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని  విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం చండూరులో ఏర్పాటు చేసిన రోడ్డు షో లో ఆయన మాట్లాడారు. ఏది ఏమైనా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని భరోసా ఇచ్చారు.ఇప్పటికే ఆరు గ్యారంటీలల్లో చాలా వాటిని అమలుచేసామన్నారు. అధికారంలోకి వచ్చి వంద రోజులే అవుతున్న హామీలు అమలు చేయడం లేదని కేసీఆర్ అసత్య ప్రచారం చేయటం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే బడుగు బలహీన వర్గాల ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. సిరిసిల్లకు ధీటుగా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. చండూరులో ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని అన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దమని తెలిపారు. కులం పేరుతో, మతం పేరుతో ఓట్లు అడిగే వారిపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని బీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు దోచుకుని అప్పులపాలు చేసి కేసీఆర్ కాలి చిప్ప అప్పజెప్పారని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణలతో బిడ్డ జైలుకు వెళ్లినా ఏ మొఖం పెట్టుకుని ప్రజల మధ్య తిరుగుతున్నావ్ కేసీఆర్ అని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని  కాపాడాలని ప్రజలను కోరారు.
అంతకు ముందు పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్ అభివృద్ధే తన లక్ష్యమని, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని  హామీ ఇచ్చారు. ఒక్క అవకాశం కల్పించాలని, ఎమ్మెల్యేలకు తోడుగా ఉండి కేంద్రం నుంచి రావలసిన నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానని పిలుపునిచ్చారు. ఒక్కసారి ఆశీర్వదించి తనను గెలిపించాలని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగు, తాగునీరు అందిస్తానని చెప్పారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిని, మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన సామాన్య వ్యక్తినన్నారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు పార్లమెంట్ నుండి పోటీ చేసే అవకాశం అధిష్టానం కల్పించిందని సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమీ లేదని, రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న కేసీఆర్‌ను ఏమీ చేయలేకపోయారని విమర్శించారు.‌ బీజేపీ కులం, మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారని, మళ్ళీ వాళ్లకు ఓట్లు వేస్తే రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ నేత, సీపీఐ జిల్లా కార్యదర్శి నేలికంటి సత్యం, దోటి వెంకటేష్ యాదవ్, కోడి శ్రీనివాసులు, , అనంత చంద్ర శేఖర్, గిరి బాబు వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love