నవతెలంగాణ ఢిల్లీ: ‘పార్లమెంట్ మార్చ్’ ను విజయవంతం చేయాలని పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ పిలుపునిచ్చారు. తనను ఆస్పత్రిలో అక్రమంగా నిర్బంధించారని ఆయన ఆక్షేపించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో 21 రోజులుగా చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. ఆయన్ని ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాంగ్చుక్ రాసిన సందేశాన్ని భార్య గీతాంజలి ఆయన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం (జులై 20) తలపెట్టి నిరసన ర్యాలీలో పాల్గొనాలని వాంగ్చుక్ కోరారు. నిర్భయమైన భారత్ సాకారం కావాలని పిలుపునిచ్చారు. తన నిరాహార దీక్షగానీ, కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టనున్న ‘పార్లమెంట్ మార్చ్’గానీ అన్యాయం నుంచి విముక్తి కోసమేనని ఆయన పునరుద్ఘాటించారు. మరోవైపు ‘పార్లమెంట్ మార్చ్’కు పోలీసులు అనుమతి ఇవ్వనట్టు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి నిరాకరించినట్టు సమాచారం.



