నవతెలంగాణ-ఆలేరు టౌన్
మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిపై కొండెంగలు దాడి చేసిన సంఘటన ఆలేరు పట్టణ బైపాస్ రోడ్ పై గురువారం చోటు చేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లా ఏనుగుర్తి మండల కేంద్రానికి చెందిన పప్పుల రఘు (28) తన ద్విచక్ర వాహనం (టిజి 07ఎజి 7785)పై ఏనుగుర్తి గ్రామం నుండి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఆలేరు పట్టణం శివారులోని బైపాస్ రోడ్డు గుండా వెళ్తుండగా ఒక్కసారిగా కొండెంగల గుంపు వచ్చి దాడి చేసింది.
కొండెంగలను చూసి తన వేగాన్ని నియంత్రించుకొని మెల్లగా ప్రయాణిస్తున్న క్రమంలో రెండు కొండెంగల నుండి తప్పించుకున్నాడు. అయినా మళ్ళీ ఒకేసారి మరో నాలుగు కొండెంగలు బైక్ పై రన్నింగ్ లో ఉండగా ఒక్కసారిగా దూకాయి. దీంతో వ్యక్తి రోడ్డుపై కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో వ్యక్తి చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అదే రోడ్డుపై మోటార్ సైకిల్ పై వరంగల్ వైపు వెళ్తున్న కొలిపాక సదానందం ఈ ప్రమాదాన్ని గమనించి తీవ్ర గాయాలైన వ్యక్తిని , స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా వైద్యులు చికిత్స అందించారు.



