మింగ మెతుకు లేదు…

Minga Methu is not...– అప్పులు పెరుగుతున్నా ‘ఉచితాల’పై బీజేపీ హమీల వరద
– అదే బాటలో కాంగ్రెస్‌
– స్వర్గం చూపిస్తామంటూ ఓటర్లకు ఎర
– హిందూత్వ పాచిక వేస్తున్న కమలదళం
– దిగజారుతున్న మధ్యప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి
భోపాల్‌ : మింగ మెతుకు లేదు…మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా ఉంది మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎన్నికల హామీల తీరు. ఓ వైపు రాష్ట్రం నెత్తిన రుణభారం పెరిగిపోతుంటే మరోవైపు వాస్తవ పరిస్థితిని దాచిపెట్టి, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తన ఎన్నికల ప్రణాళికలో హామీల వరద పారించింది. తమను గెలిపిస్తే స్వర్గం ఎక్కడో ఉండదు…మన రాష్ట్రంలోనే ఉంటుంది అంటూ ఎర వేస్తోంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం బీజేపీ రెండు రోజుల క్రితం మేనిఫెస్టో విడుదల చేసింది. రాష్ట్రంలోని పేద కుటుంబాలన్నింటికీ ఉచిత రేషన్‌ అందజేయడంతో పాటు అందుబాటులో ఉన్న మేరకు పప్పులు, ఆవనూనె, పంచదారను కూడా సబ్సిడీ రేట్లపై విక్రయిస్తామని ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు పన్నెండో తరగతి వరకూ ఉచితంగా విద్యను అందిస్తామని తెలిపింది. ఈ హామీలతో పాటు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పలు ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది జూనియర్‌ స్థాయి ఉద్యోగులకు వేతనాలు, అలవెన్సులు పెంచుతామని, అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలను కూడా రూ.13 వేలకు పెంచుతామని, రోజ్‌గార్‌ సహాయకుల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని ఆయన చెప్పారు. జిల్లా పంచాయతీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఉప సర్పంచ్‌లు వంటి నేతల గౌరవ వేతనాన్ని మూడు రెట్లు పెంచుతామని తెలిపారు.
మైనారిటీ విద్యార్థులకు రూ.135 కోట్ల ఖర్చుతో ఈ-స్కూటర్లు అందజేస్తామని, రూ.196 కోట్ల వ్యయంతో 78 వేల మంది విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇస్తామని శివరాజ్‌ సింగ్‌ అన్నారు. అయితే వీటన్నింటికీ అవసరమైన నిధులు ఎక్కడి నుండి సమకూరుస్తారో మాత్రం ఆయన చెప్పలేదు. అటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా ఉచితాలపై హామీల వరద పారిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులు పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఉచితాల కోసం పందారం చేస్తారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పోటాపోటీ హామీలు
రాష్ట్ర బడ్జెట్‌ పరిమాణం రూ.3.14 లక్షల కోట్లు. మరోవైపు రాష్ట్రం నెత్తిన ఉన్న అప్పు అక్షరాలా రూ.3.50 లక్షల కోట్లు. గత ఆరు నెలల కాలంలో చౌహాన్‌ ప్రభుత్వం ఏకంగా పది వేల కోట్ల రుపాయల అప్పు తీసుకుంది. జనాకర్షక హామీలు గుప్పించే విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ పోటీ పడుతున్నాయి. చౌహాన్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల కోసం లడ్లీ బెహనా యోజన పథకాన్ని ప్రారంభించింది. దీనికి పోటీగా కాంగ్రెస్‌ పార్టీ నారీ సమ్మాన్‌ యో జన పథ కాన్ని ప్రక టించి మహి ళలకు ప్రతి నెలా రూ.1,500 ఇస్తానని హామీ ఇచ్చింది. చౌహాన్‌ తక్కువ తిన్నారా? లడ్లీ బెహనా పథకం కింద మహిళలకు ఇస్తున్న రూ.1,500ను రూ.2,500కు పెంచారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఏకంగా మూడు వేలకు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఉచితాలపై కాంగ్రెస్‌ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌, సగం రేటుకే 200 యూనిట్ల వరకూ కరెంట్‌ వంటి హామీలు కురిపించింది. ఆవు పేడ పథకం విజయవంతం కావడంతో కిలో ఆవు పేడను రెండు రూపాయలకు కొనుగోలు చేస్తానని తెలిపింది. బియ్యం, గోధుమలకు కాంగ్రెస్‌ పార్టీ కనీస మద్దతు ధరలు ప్రకటించగానే బీజేపీ కూడా తానేం తక్కువ తినలేదన్నట్లు ఆ మొత్తాన్ని పెంచింది.
అధికారుల ఆందోళన
రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు మాత్రం ఈ పోటాపోటీ హామీలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో మరింత ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉన్నదని, పార్టీలు ప్రకటిస్తున్న ఉచితాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించే ప్రమాదం ఉన్నదని వారు తెలిపారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్‌ సుంకంతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ సెస్‌లు మాత్రమే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులని వారు చెప్పారు. పార్టీలు ఇస్తున్న హామీల్లో అధిక భాగం ప్రకటనలుగానే మిగిలిపోతాయని వారు స్పష్టం చేశారు.
ఆలయాల నిర్మాణం కోసం నిధులు
ఉచితాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడంతో పాటు అధికార బీజేపీ హిందూత్వ వాదనను మరింత ముందుకు తెస్తోంది. తద్వారా ఓ వర్గం ఓట్లను గంపగుత్తగా తన ఖాతాలో వేసుకునే ఎత్తుగడ పన్నింది. రాష్ట్రంలో నాలుగు ఆలయాల ఏర్పాటు కోసం బీజేపీ ప్రభుత్వం రూ.358 కోట్లు కేటాయించింది. సాగర్‌లోని రవిదాస్‌ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టులో భూమిపూజ కూడా చేశారు. ఈ ఆలయాన్ని రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. చింద్వారాలో పురాతన హనుమాన్‌ దేవాలయాన్ని ఆధునీకరించేందుకు చౌహాన్‌ ప్రభుత్వం రూ.350 కోట్ల నిధులను ప్రకటించింది. ఓంకారేశ్వర్‌లో రూ.2,400 కోట్ల వ్యయంతో 108 అడుగుల ఎత్తయిన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసింది.
ఆర్థికమంత్రి సూచన బేఖాతరు
పదిహేను నెలల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఓ మాట చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ‘ఉచిత’ హామీలతో అధికారంలోకి వచ్చే పార్టీ వాటికి బడ్జెటరీ కేటాయింపులు చేయాలని ఆమె సూచించారు. ఆమె చెప్పింది సబబే. కానీ చౌహాన్‌ ప్రభుత్వం ఈ సూచనను పట్టించుకోలేదు. ఆయన లడ్లీ బెహనా పథకాన్ని ప్రకటించినప్పుడు దానికి బడ్జెటరీ కేటాయింపులు లేవని ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పారు. పథకం అమలు కోసం పలు ప్రభుత్వ శాఖల నుండి పెద్ద ఎత్తున నిధులు డ్రా చేశారు. ఫలితంగా అనేక ప్రభుత్వ పనులు నిధుల కొరత కారణంగా అటకెక్కాయి.

Spread the love