– ఎమ్మెల్యే ఆదేశాలతో స్పందించిన దయానంద్, కమల్ టీమ్
– వైద్య ఖర్చులకోసం రూ. 20వేలు అందజేత
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణంలోని వాణి విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న చిన్నారి చార్లెస్ క్యాన్సర్తో బాధపడుతూ హైదరాబాదులో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దృష్టికి వచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ చిన్నారి పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మొహమ్మద్ రెహానా బేగం భర్త కమల్ పాషాను, మట్టా బృందాన్ని వెంటనే చిన్నారి ఇంటికి పంపించారు. ఎమ్మెల్యే సూచన మేరకు మట్టా దయానంద్, మొహమ్మద్ కమల్ పాషా టీమ్ హైదరాబాదులో చికిత్స పొందుతున్న చిన్నారి వద్దకు చేరుకున్నారు.
వారు బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, చిన్నారి ఆరోగ్య పరిస్థితి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారి వైద్య ఖర్చుల కోసం తక్షణ సాయంగా రూ. 20వేలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్తో చిన్నారి కుటుంబ సభ్యులను చరవాణిలో మాట్లాడించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.
పాపాయికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ భరోసా నిచ్చారు. ఎమ్మెల్యే చూపిన మానవత్వానికి, తక్షణ స్పందనకు చిన్నారి కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.



