- ప్రజాశక్తి పూర్వ సంపాదకులు, కవి, రచయిత తెలకపల్లి రవి
నవతెలంగాణ-హైదరాబాద్: అందరూ గజ ఈతగాళ్లు ఉన్నా గజం ఈదంలేదని, అదే మాదిరిగా ప్రజా కోణంలో వార్తలను విశ్లేషించడంలో ఆధునిక మీడియా దాదాపుగా వెనకబడిపోయ్యాయని ప్రజాశక్తి పూర్వ సంపాదకులు, కవి, రచయిత, విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. గురువారం హైదరాబాద్ లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయం ఎంహెచ్ భవన్ లో కామ్రేడ్ మోటూరీ హన్మంతరావు 25వ వర్థంతి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య ఆతిథిగా హాజరై..కామ్రేడ్ మోటూరీ హన్మంతరావు విగ్రహానికి నివాలు అర్పించారు. వారితో పాటు సంస్థ సీజీఎం పి. ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేష్, 10టీవీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ కే.వేణుగోపాల్ పూలమాల వేసి జోహారులు అర్పించారు. సంస్థ సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు.
ఆ తర్వాత ఎడిటర్ రాంపల్లి రమేష్ అధ్యక్షతన ‘ప్రత్యామ్నాయ మీడియా -సవాళ్లు` అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలకపల్లి రవి మాట్లాడారు. ఆధునిక మీడియాలో కార్పొరేట్ జోక్యం పెరిగిపోయిందని, ప్రజల కోసం పని చేసే పత్రికలను కూడా హస్తంగతం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాకు అధిక విస్తరణ, ఆదరణ, వ్యాప్తి ఉన్నా విశ్వనీయత లేదని తెలియజేశారు. ఆకర్షణీయమైన పదాల మాటున పదార్థం వెనుకబడిపోతుందని , పబ్లిసిటీ మీదున్న దృష్టి కంటెంట్ మీద లేదని విమర్శించారు. సోషల్ మీడియా ప్రభావంతో వాస్తవికత, అవాస్తవికతలు ఏంటో స్పష్టత లేదని, ఈ తరుణంలో అక్షర యోధులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజల మధ్య కులాలు, మత భేదాలు, ప్రాంతీయ తత్వం వంటి వాటిని ప్రేరేపించి విభజన రేఖలను పెంచుతున్నారని మండిపడ్డారు.









