నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులోని కన్యాకుమారిలో మోడీ ధ్యానం కొనసాగుతోంది. స్వామి వివేకానంద ధ్యానం చేసిన వివేకానంద రాక్ మెమోరియల్లో మోడీ మెడిటేషన్ కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం ధ్యాన ముద్రలోకి వెళ్లిన ఆయన.. శనివారం మధ్యాహ్నం వరకు అంటే దాదాపు 45 గంటల పాటు ఇక్కడే రేయింబవళ్లు ధ్యానం చేయనున్నారు. అంతకుముందు తాను పోటీ చేస్తున్న వారణాసి లోక్ సభ స్థానంలో ప్రచారం ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులోని కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ ఆయన ముందుగా భగవతీ అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ, అరటిపండ్లు సమర్పించారు. ఆలయ పూజారులు ప్రధానికి అమ్మవారి చిత్రపటం అందజేశారు.