Tuesday, May 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరహస్య ప్రదేశంలో మొజ్తాబా

రహస్య ప్రదేశంలో మొజ్తాబా

- Advertisement -

కొరియర్‌ వ్యవస్థ ద్వారానే
సమాచార మార్పిడి
అమెరికా ఇంటెలిజెన్స్‌ నివేదిక
వాషింగ్టన్‌ :
ఇరాన్‌ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ భద్రతా వలయం మధ్య గుర్తు తెలియని ప్రదేశంలో ఉన్నారని, ఆయన వద్దకు వెళ్లేందుకు కొద్ది మందికి మాత్రమే అనుమతి ఉన్నదని అమెరికా ఇంటెలిజెన్స్‌ అధికారులను ఉటంకిస్తూ సీబీయస్‌ న్యూస్‌ తెలియజేసింది. అమెరికా ఇంటె లిజెన్స్‌ అధికారుల నివేదిక ప్రకారం…సందేశాలు ఇచ్చేందుకు ఖమేనీ కీలక కొరియర్ల వ్యవస్థపై ఆధారపడ్డారు. తద్వారా తాను ఎక్కడ ఉన్నదీ ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుం టున్నారు. శాంతి ఒప్పందం కోసం అమెరికా, ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న చర్చలలో జాప్యానికి ఇది కూడా ఓ కారణం. అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్న ఇరాన్‌ అధికారులు సైతం ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని చేరవేయడంలో ఇబ్బందులు పడుతున్నారు.
ఇంటెలిజెన్స్‌ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం…అమెరికా తరఫున ప్రతిపాదనలు, ఒప్పందం వివరాలు పంపిన ప్రతిసారీ ఇరాన్‌ వైపు నుంచి స్పందన రావడానికి చాలా కాలం పడుతోంది. ఎందుకంటే అమెరికా ప్రతిపాదనలను ముందుగా కొరియర్‌ వ్యవస్థ ద్వారా సుప్రీం నేతకు చేరవేస్తారు. ఆయన తన స్పందనను తిరిగి కొరియర్ల ద్వారానే తెలియజేస్తారు. దీంతో సమాచార మార్పిడిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఖమేనీ తన చుట్టూ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీలో భాగంగా ఇజ్రాయిల్‌-అమెరికా దళాలు దాడి ప్రారంభించిన మొదటి రోజే ఆ యన గాయపడిన విషయం తెలిసిందే. ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి మొజ్తాబా ప్రజలకు కన్పించడం లేదు. అమెరికా, ఇజ్రాయిల్‌ దాడుల నుంచి తప్పించుకున్న పలువురు ఇరాన్‌ నేతలు, అధికారులు ప్రస్తుతం భూగర్బ బంకర్లలో తలదాచుకుంటున్నారని అమెరికా అధికారులు సీబీయస్‌ న్యూస్‌కు తెలిపారు. దీంతో వారి మధ్య సమాచార మార్పిడి చాలా పరిమితంగానే ఉంటోంది. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో జరుగుతున్న జాప్యంపై కొందరు ఇరాన్‌ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌ సీనియర్‌ అధికారులు, నేతలకు కూడా మొజ్తాబా ఎక్కడ ఉన్నదీ తెలియడం లేదు. ఆయనతో నేరుగా సంభాషించే అవకాశం వారికి కలగడం లేదు. కేవలం కొరియర్ల ద్వారా మాత్రమే సమాచార మార్పిడి జరుగుతోంది. అమెరికాతో చర్చలు జరుపుతున్న ఇరాన్‌ ప్రతినిధులకు మొజ్తాబా ఆదేశాలు పంపుతున్నారని, ఏయే అంశాలపై సంప్రదింపులు జరపాలో సూచిస్తున్నారని, వేటిపై పట్టుపట్టాలో నిర్దేశిస్తున్నారని ఇంటెలిజెన్స్‌ అధికారులు తెలిపారు. ఏదేమైనా నత్తనడక నడుస్తున్న కమ్యూనికేషన్‌ ప్రక్రియ కారణంగా చర్చలపై తుది నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -