భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
నవతెలంగాణ దినపత్రిక ప్రజల శక్తిగా.. ప్రజాశక్తిగా.. నిజాలను నిర్భయంగా రాసే పత్రిక అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలో యాదాద్రి భువనగిరి జిల్లా స్పెషల్ రెండవ సంచికను ఆవిష్కరించి, మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో డిజిటల్ మీడియా ప్రభావంతో అనేక రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయని, అందులో నిజాలను నిర్భయంగా రాసే పత్రిక నవతెలంగాణ అని చెప్పారు. నవతెలంగాణ పత్రిక ప్రజా సమస్యలను వెలికితీస్తూ, ప్రజా సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడాలని కోరారు. పత్రికలు ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రతిబింబించేలా ప్రజాక్షేత్రంలో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని కోరారు.
నవతెలంగాణ దినపత్రికకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ భువనగిరి అడ్వర్టైజ్మెంట్ ఇంచార్జి షేక్ ఉస్మాన్ షరీఫ్, నవతెలంగాణ సీనియర్ రిపోర్టర్ పాక జహంగీర్ యాదవ్ లు ఉన్నారు.



