నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తూ కర్నాటక రాష్ట్రంలోని మాద్యేలో డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ ఎదుట విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. వందల సంఖ్యలో చేరుకున్న విద్యార్థులు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులపై కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రం లీక్ కావడం వల్ల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని నిరసనకారులు ఆగ్రహాం వ్యక్తం చేశారు, ప్రవేశాల కోసం NEETని రద్దు చేసి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ‘కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ (CET)ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. “మాకు NEET వద్దు, CET కావాలి” అని వారు నినదించారు.
నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ తీశారు. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. “ప్రశ్నపత్రం లీక్ కాకుండా పరీక్ష నిర్వహించే సామర్థ్యం కేంద్రానికి లేదు. ఇక వారు దేశాన్ని ఎలా రక్షించగలరు? వేలాది మంది విద్యార్థుల మరణాలకు వారే బాధ్యులు,” అని నిరసనకారులు పేర్కొన్నారు. కర్ణాటక CET ద్వారా అభ్యర్థుల ఎంపికకు అనుమతించాలని, “విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం” మానుకోవాలని వారు కేంద్రాన్ని కోరారు.




