నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని చిన్న శక్కార్గ గ్రామపంచాయతీ పరిధిలో చిన్న షక్కర్గా, సలాబాత్పూర్, గ్రామాలు ఉన్నాయి. ఎప్పడు ఏ ఎన్నికలు వచ్చినా.. సలాబత్పూర్ గ్రామ ఓటర్లు చిన్న షక్కర్గాలోనే ఓటు హక్కును వినియోగించుకునేవారు. ఎందుకంటే ఈ రెండు గ్రామాలకు కలిపి ఒకే పోలింగ్ బూత్ ఉండేది. చిన్నషక్కర్గా నుంచి సలాబత్పూర్ కు దాదాపుగా 3 కిలోమీటర్ల దూరం ఉండేది. దీంతో దివ్యాంగులు, వృద్ధులు అంతదూరం వెళ్ళలేక ఓటుహక్కును వినియోగించుకోలేని పరిస్థితులు కూడా లేకపోలేదు. మా గ్రామంలో పోలింగ్ బూత్ లేనందున నడవలేనివారు, దీర్ఘకాలిక రోగులు ఓటు వేయలేకపోతున్నారని పలుమార్లు తహశీల్దార్ కు వినతిపత్రాన్ని అందించారు.
అయితే తాజాగా ఈమధ్య మొదలైన ఎస్ఐఆర్ ప్రకియలో భాగంగా తహశీల్దార్ ఎండీ ముజీబ్ ప్రత్యేక చొరవ తీసుకుని ఎలక్షన్ అధికారుల ఆదేశంతో సలాబత్పూర్ లో నూతన పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. ఈ సందర్బంగా సలాబత్పూర్ ప్రజలు తహశీల్దార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ.. ఈ పోలింగ్ బూత్ ఏర్పాటుతో జుక్కల్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ ల సంఖ్య 256కు చేరుకుందని చెప్పారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బీజేపీ కౌన్సిల్ మెంబర్ బి. హన్మాండ్లు బీజేపీ బూత్ అధ్యక్షులు బి. గ్యానేశ్వర్, యోగేష్, ఖాయుమ్, అంకిత్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.



