అదానీ గ్రూపునకు నో

అదానీ గ్రూపునకు నో– ‘మహా’ ప్రభుత్వ శాఖలకు ధారవి భూమి బదిలీ
– అదానీ.. ప్రాజెక్ట్‌ డెవలపర్‌ మాత్రమే : విశ్వసనీయ వర్గాల వెల్లడి
ముంబయి : కోట్లాది రూపాయల ధారావి మురికివాడల పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌లో అదానీ గ్రూప్‌నకు భూబదలాయింపు ఉండదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వ శాఖలకు ఈ భూమి బదిలీ ఉంటుందని సమాచారం. అదానీ గ్రూపు.. ప్రాజెక్ట్‌ డెవలపర్‌ మాత్రమేననీ, ఇండ్లను నిర్మించి ఆసియాలోని అతిపెద్ద మురికివాడల నివాసితులకు అందించటానికి ప్రభుత్వ శాఖలకు అప్పగిస్తుందని తెలిపాయి. ఎంపీ వర్షా గైక్వాడ్‌ చేసిన భూకబ్జా ఆరోపణలను ఖండిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ గృహనిర్మాణ శాఖకు చెందిన ధారావి రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌(స్లమ్‌ రిహాబిలిటేషన్‌ అథారిటీ) (డీఆర్‌పీలేదా ఎస్‌ఆర్‌ఏ)కి మాత్రమే భూ బదిలీ జరుగుతుందని ప్రాజెక్టుతో సంబంధమున్న విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.
బహిరంగ అంతర్జాతీయ బిడ్డింగ్‌లో ధారావి స్లమ్‌ రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ను గెలుచుకున్న అదానీ గ్రూప్‌, మహారాష్ట్ర ప్రభుత్వంతో తన జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ధారవి రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌(డీఆర్‌పీపీఎల్‌) ద్వారా అద్దెలు – హౌసింగ్‌, వాణిజ్య నిర్మాణాలను నిర్మిస్తుంది. వాటిని మళ్లీ డీఆర్‌పీ లేదా ఎస్‌ఆర్‌ఏకి సర్వే ఫలితాల ప్రకారం కేటాయింపు కోసం మహారాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. ప్రాజెక్ట్‌పై అపోహలను తొలగించేందుకు ప్రయత్నిస్తూ, టెండర్‌ ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం భూమిని డీఆర్‌పీ లేదా ఎస్‌ఆర్‌ఏకు కేటాయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డీఆర్‌పీపీఎల్‌ అభివృద్ధికి డిమాండ్‌ మేరకు ప్రభుత్వానికి చెల్లించాలి.
ధారవి నివాసితుల కోసం మొదటి పునరావాస యూనిట్లను నిర్మించాల్సిన రైల్వే భూమి కేటాయింపు అంశంపై టెండర్‌ వేయటానికి ముందే డీఆర్‌పీకి కేటాయించామనీ దీనికి డీఆర్‌పీపీఎల్‌ 170 శాతం ప్రీమియం చెల్లించిందని సదరు వర్గాలు తెలిపాయి.

Spread the love