నామినేషన్‌ వేసే అభ్యర్థులు నియమాలు పాటించాలి

– సరైన పత్రాలతో నామినేషన్లు దాఖలు చేయాలి
– ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి లింగ్యా నాయక్‌
నవతెలంగాణ-కొడంగల్‌
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు ఎలక్షన్‌ కమిషన్‌ ఇచ్చిన మార్గదర్శకాల నియమావళిని పాటించాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి లింగ్యా నాయక్‌ అన్నారు. కోడంగల్‌లోని మండల తహసీల్దార్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోడంగల్‌ నియోజకవర్గం పోలీస్‌ స్టేషన్‌ 72లో మొత్తం ఓటర్లు రెండు లక్షల 30 వేల251 నమోదయ్యాయని అన్నారు. నామినేషన్‌ దాఖలు ప్రారంభం కావడంతో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ పత్రాలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి సందేహాలు ఉన్న హెల్ప్‌ డెస్క్‌లో నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రతి అభ్యర్థి నామినేషన్‌ ఫారం 2బి తో పాటు అఫీటవిట్‌ ఫామ్‌ 26 తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీ ద్వారా అభ్యర్థిని ఏర్పాటు చేస్తే పామ్‌ ఎ, ఫామ్‌ బి ఇవ్వాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు రూ.10 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలైతే కుల ధ్రువీకరణ పత్రం పెడితే రూ.5 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలన్నారు. స్టాంప్‌ ఫోటోలతో పాటు 8 పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు ఇవ్వాలన్నారు. ఎన్నికల ఖర్చు కోసం ఒక రోజు ముందు తీసుకున్న బ్యాంకు పాస్‌ బుక్‌ ఇవ్వాలన్నారు. ఇతర నియోజకవర్గాల్లో ఓటర్గ నమోదై ఉంటే ఈఆర్వో అట్టాచ్‌ చేసి కాఫీ ఇవ్వాలన్నారు. అభ్యర్థి ఎలక్షన్‌ ఏజెంట్‌ను నియమిం చుకుంటే ఫార్మ్‌ ఎయిట్‌ ఇవ్వాల్సి ఉంటుం దన్నారు. నామినేషన్‌ వేస్తున్న సమయంలో అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. అభ్యర్థి వాహనంతో పాటు మరో రెండు వాహనాలకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. ఇతరులు నామినేషన్‌ సెంటర్‌కు వంద మీటర్ల దూరంలో ఉండాలన్నారు, 80 సంవత్సరాలు నిండిన ఓటర్లకు ఫామ్‌ డి తో ఇంటి దగ్గరనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామన్నారు. స్వాతంత్ర అభ్యర్థులు ఉంటే వారు కోరుకున్న మూడు సింబల్స్‌ ఎంచుకోవాలన్నారు. నాలుగు సేట్ల వరకు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయవలసి ఉంటుందన్నారు. 25 సంవత్సరాలు నిండినవారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలన్నారు. 30వ తేదీన జరిగే ఎన్నికలకు ముందు 48 గంటల నుండి ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికల అధికారులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజరు కుమార్‌, దౌల్తాబాద్‌ తహసీల్దార్‌ విజయకుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Spread the love