నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవల తరచూ విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. చాలా వరకు గగనతలంలోనే జరుగుతుంటే.. మరికొన్ని టేకాఫ్ అయ్యే సమయంలో.. ల్యాండ్ అయ్యే కొద్ది క్షణాల ముందు చోటుచేసుకుంటున్నాయి. ఇంకొన్ని పైలట్లు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చోటుచేసుకుంటున్న ఘటనలూ ఉన్నాయి. అయితే తాజాగా ముంబయి విమానాశ్రయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ముంబయి ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. రన్వేపై నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదే సమయానికి ఇండిగో విమానం ల్యాండ్ అయింది. దీంతో టేకాఫ్ అవుతున్న ఎయిరిండియా జెట్ జస్ట్లో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన ముంబయి విమానాశ్రయంలో శనివారం చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనపై సమగ్ర విచారణకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశించడంతో పాటు డ్యూటీలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని తొలగించింది. ఈ రెండు విమానాలు దగ్గరగా వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.