ఎస్టీలకు 10శాతం, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దే
మాజీ ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షులు గూగులోతు రవి నాయక్
నవతెలంగాణ – నర్సింహులపేట
రాష్ట్రంలో ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని మాజీ ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షులు గూగులోతు రవి నాయక్ అన్నారు. గురువారం నర్సింహులపేట మండలం పకీరతండా గ్రామంలో స్థానిక సర్పంచ్ కైల, ఉప సర్పంచ్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మాట్లాడారు. గిరిజనుల విద్య,ఉద్యోగ అవకాశాలను పెంచాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 10శాతం రిజర్వేషన్ కల్పించిందని తెలిపారు. ఇలాకేసీఆర్ పదేళ్లపాలనలో గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేకప్రాధాన్యత ఇచ్చామన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామన్నారు. రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు గురుకులాలు, వసతిగృహాల ద్వారా గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజన సదుపాయాలు అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా గిరిజనులకు ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట గ్రామ పార్టీ అధ్యక్షులు మలోత్ వెంకన్న, వార్డు సభ్యులు రవి, కవిత ఉదయ్, లత రెడ్డి, శ్రీను, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.



