Monday, July 6, 2026
E-PAPER
Homeఖమ్మంపథకాల ప్రచారానికి పంచాయతీ తీర్మానం

పథకాల ప్రచారానికి పంచాయతీ తీర్మానం

- Advertisement -

– గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయం
– ఎస్డీపీఐ ఎం.వీరన్న
నవతెలంగాణ – అశ్వారావుపేట

తపాలాశాఖ అందిస్తున్న పొదుపు, పెట్టుబడి, బీమా, బ్యాంకింగ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామపంచాయతీ తీర్మానించింది. వార్డు సభ్యులు ప్రజలకు తపాలా శాఖ పథకాల పై అవగాహన కల్పించాలని గ్రామసభలో నిర్ణయించారు.

డీసీడీపీ (డాక్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం)లో భాగంగా అచ్యుతాపురం, ఊట్లపల్లి, నారాయణపురం, బచ్చువారిగూడెం గ్రామపంచాయతీల్లో సోమవారం నిర్వహించిన గ్రామసభల్లో పాల్వంచ సబ్‌డివిజనల్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ మాళోతు వీరన్న మాట్లాడారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వ వ్యవస్థ తపాలాశాఖ అని అన్నారు.అధిక లాభాల పేరుతో మోసాలకు పాల్పడే ప్రైవేటు సంస్థలను నమ్మి పొదుపు, పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దని ప్రజలకు సూచించారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తపాలా కార్యాలయాలు నేడు మినీ బ్యాంకులుగా మారాయని, ఇంటి వద్దకే పలు సేవలను అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నాయని తెలిపారు. అచ్యుతాపురం సర్పంచి సరిహద్దుల పోలయ్య మాట్లాడుతూ గ్రామపంచాయతీ వ్యవస్థకు, తపాలాశాఖకు అవినాభావ సంబంధం ఉందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడంలో తపాలాశాఖ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమాల్లో ఊట్లపల్లి సర్పంచి శ్రీలక్ష్మి, అచ్యుతాపురం ఉపసర్పంచి పాకనాటి నాగేశ్వరరావు, మెయిల్ ఓవర్సీస్ దుర్గాప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రమేష్, పలువురు బీపీఎంలు, ఏబీపీఎంలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -