– విడతల వారీగా కొత్త బస్సులు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
– ఎంజీబీఎస్లో న్యూ ఇయర్ వేడుకలు
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
టీఎస్ ఆర్టీసీకి ప్రయాణికులు, సిబ్బంది రెండు కండ్లలాంటి వారని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఎంజీబీఎస్ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలకు సజ్జనార్ హాజరయ్యారు. ప్రయాణికులు, సిబ్బందితో కలిసి ఆయన కేక్ కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఎంజీబీఎస్లో ప్రయాణికులతో ముచ్చటించారు. బెంగళూరు, కోదాడకు వెళ్తున్న బస్సుల్లో ప్రయాణికులకు గులాబీలు అందించి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ.. గతేడాది ప్రయాణికులు సంస్థను బాగా ఆదరించారని, ఈ సంవత్సరం కూడా ప్రయాణికుల ఆదరాభిమానాలు సంస్థపై ఉండాలని కోరారు. కొత్త ఏడాదిలో సంస్థకు మంచి ఫలితాలు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలవుతోందన్నారు. ఇప్పటివరకు దాదాపు 6.60 కోట్లకు పైగా మహిళలను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని తెలిపారు. టీఎస్ఆర్టీసీ సిబ్బంది నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణకు నిదర్శనమనే విషయాన్ని మహాలక్ష్మీ పథకం అమలుతో మరోసారి నిరూపించారని అన్నారు. మహాలక్ష్మి స్కీమ్ను ప్రశాంతంగా అమలు చేస్తున్నాంటూ సంస్థను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారని చెప్పారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఒకవైపు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూనే.. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పెండింగ్లో ఉన్న 9 డీఏలను మంజూరు చేశామని, త్వరలోనే మిగతా బకాయిలను చెల్లిస్తామని తెలిపారు. విడతల వారీగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నో ఏండ్లుగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ.. సంస్థను ఆదరిస్తున్న ప్రయాణిక ులను సజ్జనార్ సన్మానించారు. స్వాతి, నారాయణ, మల్లేష్, గోపాల్ రెడ్డి, షాబుద్దిన్లను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీ సీవోవో డా.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ముని శేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప, సీఎంఈ రఘునాథ రావు, సీఈఐటీ రాజ శేఖర్, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.