– సీఐగా జలంధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ – బోడుప్పల్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తానని నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డి. జలంధర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మేడిపల్లి సీఐగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు భద్రతా వాతావరణాన్ని కల్పించడం తన ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ప్రాంతంలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా చైన్ స్నాచింగ్, డ్రగ్స్, మహిళలపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పడం ద్వారా సమస్యలను సమర్థంగా పరిష్కరిస్తామని ఆయన అన్నారు. పోలీస్ శాఖపై ప్రజలకు నమ్మకం పెంచేలా పని చేస్తానని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.ట్రాఫిక్ సమస్యలు, స్థానిక వివాదాల పరిష్కారంలో సమన్వయం సాధిస్తూ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటామని జలంధర్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని స్వాగతం పలికారు.



