– ప్రజలపై భారాలు మోపొద్దంటూ సీపీఐ(ఎం) ఆందోళన
నవతెలంగాణ-ఉప్పునుంతల
మండలంలోని రాయిచేడు గ్రామంలో సోమవారం సీపీఐ(ఎం) గ్రామ శాఖ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు చింతల నాగరాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ సామాన్య ప్రజలపై భారాలు మోపడం తగదని విమర్శించారు. ఇంధన ధరల పెంపును సీపీఎం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ప్రజలపై ఆర్థిక భారం మోపే నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల నాయకులు గొడుగు వెంకటయ్య, గొడుగు చంద్రయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు బాలయ్య, రైతు సంఘం నాయకులు తోళ్ల ఆనంద్, డీవైఎఫ్ఐ నాయకులు యాదయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



