టెన్త్‌ విద్యార్థిపై పెట్రోల్‌ పోసి…

– ఏపీలో దారుణం..
చెరుకుపల్లి గ్రామీణం: బాపట్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థి అమర్నాథ్‌పై స్నేహితుడే పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. చెరుకుపల్లి మండలం రాజోలులో ఈ ఘటన జరిగింది. ఉదయం ట్యూషన్‌కు వెళ్లొస్తుండగా బాలుడి స్నేహితుడు వెంకటేశ్వరరెడ్డి మరికొందరితో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన అమర్నాథ్‌ను గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.
వివరాల్లోకి వెళితే.. చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీ పరిధి ఉప్పలవారిపాలెంకి చెందిన ఉప్పల అమర్నాథ్‌ స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజూ ఉదయం రాజోలులో ట్యూషన్‌కి వెళుతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం వెళుతుండగా మార్గంమధ్యలో రెడ్లపాలెం వద్ద అమర్నాథ్‌ స్నేహితుడు వెంకటేశ్వరరెడ్డి మరి కొందరితో కలిసి అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.
మంటల అంటుకొని బాలుడు హాహాకారాలు చేస్తుండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే మంటలు ఆర్పి అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. తనపై వెంకటేశ్వర్‌రెడ్డి, మరికొందరు పెట్రోల్‌ పోసి నిప్పంటించారని మృతికి ముందు పోలీసులకు అమర్నాథ్‌ వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఘటనపై చెరుకుపల్లి ఎస్సై కొండారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అమర్నాథ్‌ సోదరిని వెంకటేశ్వరరెడ్డి వేధిస్తున్నాడని మృతుడి తాత రెడ్డయ్య అన్నారు. దీనిపై అమర్నాథ్‌ నిలదీయడంతోనే వెంకటేశ్వరరెడ్డి కక్ష పెంచుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు.

Spread the love