– ముగ్గురు అరెస్ట్.. రూ.5,500 నగదు, రెండు బైక్ లు స్వాధీనం
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు అశ్వారావుపేట ఎస్ఐ యయాతి రాజు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేపట్టారు.
ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.5,500 నగదు, రెండు మోటార్సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ పేకాట,కోడిపందాలు వంటి అక్రమ జూద కార్యకలాపాలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే డయల్ – 100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.



