ప్రత్యేకాధికారుల జాబితా సిద్ధం…!

నవతెలంగాణ –  మల్హర్ రావు
రాష్ట్రంలో వచ్చే నెల 1న సర్పంచుల పదవీకాలం ముగుస్తుండడంతో పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు జాబితాలను కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామ పంచాయతీలున్నందున వీటికి అవసరమైన మేరకు నియామకాలు జరగాలన్న ప్రభుత్వ సూచన మేరకు నిర్ణీత నమూనాలో కలెక్టర్లు జాబితాలను రూపొందించారు. ప్రతి అధికారి హోదా, ఏ గ్రామానికి ప్రత్యేకాధికారిగా ఉంటారు.. సెల్‌ఫోన్‌ నంబరు, వారు నిర్వహించే శాఖ తదితర సమాచారాన్ని క్రోడీకరించారు. 12 వేల మందికిపైగా అధికారులు, సిబ్బంది అవసరం ఉన్నందున ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవులో ఉన్న వారిని వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్లు సమాచారం ఇచ్చారు. ప్రత్యేకాధికారుల నియామకానికి సంబంధించి ఈ నెల 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. వచ్చే నెల 1న సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున అంతకంటే ముందే ప్రత్యేకాధికారులు గ్రామాలను సందర్శించి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని.. ఆయా పంచాయతీలపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వం నిర్దేశించనుంది.
వీరే ప్రత్యేకాధికారులు..
తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీరాజ్‌ సహాయ ఇంజినీర్లు, గ్రామీణ నీటి సరఫరా శాఖ (మిషన్‌ భగీరథ) సహాయ ఇంజినీర్లు, సమగ్ర శిశు అభివృద్ధి సేవాసంస్థ (ఐసీడీఎస్‌) సూపర్‌వైజర్లు, మండల విద్యాధికారులు, వ్యవసాయాధికారులు, పశువైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సూపర్‌వైజర్లు, ఉద్యాన అధికారులు, ఉప తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, మండల పరిషత్‌ సూపరింటెండెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణాధికారులు, టైపిస్టులు, గెజిటెడ్‌ హెడ్మాస్టర్లు, హెడ్మాస్టర్లు, స్కూలు అసిస్టెంట్లు ఉన్నారు.
Spread the love